ss-rajamouliప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్థానంలో ఉన్న దర్శకుడు రాజమౌళి సినీ కెరీర్ కు 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. జక్కన్న దర్శకత్వం వహించిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా విడుదలై, 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “తాను దర్శకుడిగా మారి 15 ఏళ్లు అయిందని, డబ్బింగ్ ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేరి 25 ఏళ్లైందని, అయితే తాను సినీ పరిశ్రమలోకి వచ్చి అంతకాలం ముగిసినట్టు అనిపించడం లేదని” అన్నారు.

ఈ సందర్భంగా “స్టూడెంట్ నెం.1” షూటింగ్ కు స్విట్జర్లాండ్ కు వెళ్లగా, అక్కడ జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. నిర్మాత తారక్ కు తనకు కలిపి ఒక రూమ్ ఇచ్చారని, తనకేమో 9 గంటలకే నిద్రపోవడం అలవాటని, తారక్ కు మాత్రం రాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటని, అది కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాడని, స్విట్జర్లాండ్ లో ఒకే ఛానెల్ లో ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యేవని తెలిపాడు. అది ఎప్పుడు గుర్తొచ్చినా… తారక్ ను తిట్టుకుంటాను అంటూ నాటి విషయాలను స్మరించుకున్నారు.

“స్టూడెంట్ నెం.1” విజయం క్రెడిట్ ను కథ అందించిన పృథ్వీతేజకి, సంగీతం అందించిన కీరవాణికి ఇస్తానని తెలిపాడు. సినిమా సక్సెస్ అయిన తరువాత విజయయాత్రకు వెళ్లినప్పుడు, హీరోగా తారక్ ను అంగీకరించడం చూశానని, అతనిని చూసేందుకు పెద్దవాళ్లు వచ్చేవారని రాజమౌళి తెలిపాడు. అప్పటి తన దర్శకత్వ ప్రతిభను చూసుకుంటే పరిణతి చెందనట్టు అనిపిస్తుందని, కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ చాలా బాగా నటించాడని కితాబిచ్చారు ఈ ‘దర్శక ధీరుడు.’