‘బాహుబలి’ సినిమాకు జాతీయ అవార్డు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అయితే ఈ సందర్భంగా స్పందించిన ‘బాహుబలి’ కధ సృష్టికర్త, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. ‘బాహుబలి’ సినిమాలోని కీలక పాత్రలలో ఒకటైన ‘శివగామి’ పాత్రకు అలనాటి అందాల భామ ‘అతిలోకసుందరి’ శ్రీదేవి కోసం చాలా ప్రయత్నించామని, అయితే ఆమె ఒప్పుకోకపోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఈ పాత్రలో రమ్యకృష్ణ చాలా అద్భుతంగా నటించిందని… వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
‘శివగామి’ పాత్రలో రమ్యకృష్ణ అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం నిజమే అయినా… శ్రీదేవి అభినయాన్ని కించపరిచే విధంగా ఉండడమే ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యతను కల్పిస్తోంది. నిజానికి ‘బాహుబలి’ సినిమా తర్వాత విడుదలైన తమిళ సినిమా ‘పులి’ చిత్రంలో మహారాణిగా కనిపించిన శ్రీదేవి… ప్రేక్షకులను మెప్పించింది. ‘బాహుబలి’ పాత్ర కూడా దాదాపుగా ఇలాగే ఉండడంతో అప్పట్లోనే విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే ఎవరైతే శ్రీదేవి కోసం ప్రయత్నించారో స్వయంగా వారే ఓ మీడియా వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికంతటికి అసలు కారణం… ‘శివగామి’గా రమ్యకృష్ణ అభినయించిన తీరు, ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడానికి లేకుండా చేస్తోందన్నది అసలు వాస్తవం. తెలుగు నటులు ఏ స్థాయిలో తన అభినయాన్ని ప్రదర్శించగలరో రమ్యకృష్ణ చాటిచెప్పారన్నది గ్రహించాల్సిన అంశం.