hyderabad_rainsగత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతుండగా, ‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు’ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందన్న సమాచారం ప్రజలకు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ, ఏపీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరిసే ప్రమాదముందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు.

ఇప్పటికే విశ్వనగరం హైదరాబాద్ లోని పలు లోతట్టు కాలనీల్లోని అపార్టుమెంట్లు వరద ముంపు నుంచి బయట పడలేదు. ఈ సమయంలో మళ్లీ భారీ వర్షాలు కరుస్తాయని వస్తున్న వార్తలతో నగరవాసులు ఆంధోళనను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సినీ పరిభాషలో చెప్పాలంటే… ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలను ‘వదల బొమ్మాలి’ అని వరుణుడు అంటున్నట్లుంది.