Rahurama krishnam raju comments on vijaysai reddyతనపై వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో రఘురామకృష్ణంరాజు ముందు వరుసలో ఉంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా… ఇలా వేదిక ఏదైనా గానీ వైసీపీ వర్గాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కౌంటర్లు వేయడంలో ఆర్ఆర్ఆర్ నిమగ్నం అవుతున్నారు.

త్వరలో తాను ఎన్నికలకు వెళ్ళబోతున్నానని బహిరంగంగానే ప్రకటించిన రఘురామ, తనను భారీ మెజారిటీతో గెలిపించి, జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందిగా ప్రజలను కోరారు. తాను ఎలా అయితే వైసీపీ సర్కార్ పై పోరాడుతున్నానో, తనను స్ఫూర్తిగా తీసుకుని జగన్ సర్కార్ పై పోరాటపటిమను ప్రదర్శించాలని ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు.

విజయసాయిరెడ్డి : ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట! ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్నస్ఫూర్తి ఏంటో? బ్యాంక్‌లను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా? ఓట్లు వేసిన వారికే ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా? ఆరడుగులున్నా అన్నీ మరుగుజ్జు ఆలోచనలే!

అసలే వైసీపీ వర్గాలపై మాంచి కాక మీద ఉన్న రఘురామకృష్ణంరాజు, తనవి మరుగుజ్జు ఆలోచనలని విమర్శించడంతో, ఆర్ఆర్ఆర్ కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందిస్తూ ట్వీట్ చేసారు.

ఆర్ఆర్ఆర్ : నువ్వు, నీ ఏ1 నన్ను ఎంత కవ్వించి రప్పించి చంపాలని చూస్తున్నారో నాకు తెలీదా ఏ2. ఇంటి నుంచి బయటకు పరదాలు కట్టుకుని ఎవరు వస్తున్నారో అందరికీ తెలుసు. ముందు నువ్వు, నీ ఏ1 కోర్టుకి హాజరు అవ్వండి. నా కేసులు నేను చూసుకుంటానులే ఏ2. మీలాగే మీ ఆలోచనలు కూడా మరగుజ్జే!

జగన్ అక్రమాస్తుల కేసులో ఏ1గా జగన్ మోహన్ రెడ్డి, ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. సాయిరెడ్డి చేసిన విమర్శలకు స్పందనగా… పేర్లను వదిలేసి ఏకంగా ‘ఏ1 ఏ2’ అంటూ సంబోధించడం ఆర్ఆర్ఆర్ దృక్పథానికి అద్దం పడుతోంది.