Rahul Gandhi says  Demonetisation should have been thrown in the dustbinపెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే కనుక ప్రధానిని అయి ఉంటే ఆ ప్రతిపాదన తన వద్దకు వచ్చినప్పుడు పెంటకుప్పలో పడేసి ఉండేవాడినని పేర్కొన్నారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం మలేషియాలో ఉన్న రాహుల్ కౌలాలంపూర్‌లో భారత సంతతి ప్రముఖులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మీరు ప్రధాని అయితే పెద్ద నోట్ల మరోలా ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ… అసలు ఆ నిర్ణయమే తప్పని, తాను ప్రధాని మంత్రిని అయి ఉంటే, ఆ ప్రతిపాదన ఫైలు తన వద్దకు వచ్చినప్పుడు దానిని చెత్తబుట్టలో పడేసి ఉండేవాడినని అన్నారు. తలుపు ఆవల పెంటకుప్పలోకి విసిరేసి ఉండేవాడినని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ఏ రకంగా చూసినా మంచిది కాదన్నదే తన ఉద్దేశమని రాహుల్ తేల్చి చెప్పారు.

ఇక ఐఐఎం పూర్వ విద్యార్థులతో సమావేశంలో మాట్లాడుతూ… మా నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోబోతున్నాడని మాకు ముందే తెలుసు. అలాగే మా నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోతోందని కూడా మాకు ముందే తెలుసు. రాజకీయాల్లో ఉండి దుష్టశక్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా… దేనికోసమైనా గట్టిగా నిలబడినా మరణం తప్పదు. ఇది స్పష్టం… అంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత చాలా కాలం కోపంగా ఉండేదని.. కానీ తర్వాత వారిని పూర్తిగా క్షమించేశామని పేర్కొన్నారు.

ఎల్ టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయినప్పుడు టీవీలో అతడి మృతదేహాన్ని చూశానని, ఆ సమయంలో తనకు రెండు రకాల భావాలు కలిగాయని రాహుల్ గాంధీ చెప్పారు. ‘ఒకటేమిటంటే.. వాళ్లు (శ్రీలంక ప్రభుత్వం) ప్రభాకరన్ తో అలా ఎందుకు అవమానకరంగా వ్యవహరించారు అనిపించింది. ఇక ప్రభాకరన్ గురించి, అతని పిల్లల గురించి ఆలోచిస్తే బాధనిపించింది. ఏదైనా హింసాత్మక ఘటన జరిగినప్పడు దాని వెనుక కచ్చితంగా ఓ మనిషి ప్రమేయం ఉంటుంది. ఓ కుటుంబం ఉంటుంది, ఓ చిన్నారి రోదన ఉంటుంది. అలాంటి బాధను నేను కూడా అనుభవించాను. మనుషులను ద్వేషించడం చాలా కష్టం… అంటూ ఉద్వేగభరితులయ్యారు.