2019 ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘనవిజయం తరువాత ముఖ్యమంత్రి జగన్ ని ఎక్కువగా ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే అది ఎంపీ రఘురామ కృష్ణ రాజే అని చెప్పుకోవాలి. ప్రతిపక్షాల విమర్శలు ఎవరికైనా మాములే అయితే స్వపక్షంలో ఉండి విపక్షంగా తయారైన ఆర్ఆర్ఆర్ జగన్ కు పంటి కింద రాయిలా మారారు.
ఆ విరోధం ఆయనను జైలు కు పంపడం… సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ (ఆర్ఆర్ఆర్ ఆరోపణల ప్రకారం) దాకా వెళ్ళింది. అయితే సుప్రీం కోర్టు నుండి బెయిల్ తెచ్చుకుని రాజు బయటకు వచ్చారు. కేసు గురించి మీడియాతో గానీ సోషల్ మీడియాలో గానీ మాట్లాడొద్దు అని కోర్టు చెప్పడంతో ఆయన కొంత కాలం సైలెంట్ అయ్యారు.
మీడియా ముందుకు రాకుండా ముఖ్యమంత్రికి రోజుకు ఒక లేఖ రాస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అవి పెద్దగా ప్రభావం చూపించకపోవడం తో నెమ్మదిగా ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టి… ఇప్పుడు దాదాపుగా తన పాత స్టైల్ ప్రెస్ మీట్లకు వెళ్లిపోయారు. మధ్యలో ఆర్ఆర్ఆర్ సైలెంట్ గా ఎన్ని రోజులు ఉన్నారంటే… రెండు నెలలు కూడా ఉండలేకపోయారు.
మరోవైపు… ఆయనను ఎంపీ గా అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంట్ లో గట్టి ప్రయత్నమే చేస్తుంది. అవకాశం దొరికితే కొత్త కేసులు కూడా పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఆర్ఆర్ఆర్ ఆ అవకాశం ఇవ్వకుండా చాకచక్యంగా తాను అనుకున్న పని చెయ్యగలరా అనేది చూడాలి.