radhika-sarathkumar -Nadigar -Sangamదక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నడిగర్ నుంచి తమిళ సీనియర్ నటుడు, మాజీ అధ్యక్షుడు శరత్ కుమార్, మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు సదరు సంస్థ ప్రకటించింది. తాము నిర్వహించిన శోధనల్లో గత కార్యవర్గం దాదాపు 1.65 కోట్లు చేసిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని, దీంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ప్రకటన విడుదల చేసింది.

నడిగర సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపిన కార్యవర్గ సభ్యులు, తనిఖీల్లో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఈ ముగ్గురి ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయట పడతాయని భావిస్తున్నామని, వీరి అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం చర్యలు ఉంటాయని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.

అయితే దీనిపై సీనియర్‌ సినీ నటి రాధిక ఫేస్ బుక్ వేదికగా మండిపడ్డారు. ‘మొదట 100 కోట్లు అవకతవకలు అన్నారు, ఇప్పుడు డిస్కౌంట్‌ ఇచ్చారా? అయినా ఆరోపణలు ఉన్నప్పుడు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా తొలగించడం కరెక్టేనా? నీలో ఇంత ద్వేషం ఉందా? ఇలా అడిగినందుకు నన్ను కూడా సస్పెండ్‌ చేయండి’ అంటూ తమిళ హీరో విశాల్ ను టార్గెట్ చేసుకుని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ వివాహమంటూ కోలీవుడ్ లో గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.