Pusapati Ananda Gajapthi Raju died“అభినవ ఆంధ్ర భోజుడి”గా పేరుగాంచిన విజయనగరం రాజవంశానికి చెందిన పూసపాటి ఆనంద గజపతిరాజు అనారోగ్యం కారణంగా మణిపాల్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. విజయనగర రాజ వంశానికి చెందిన ఆనంద గజపతిరాజు… ప్రస్తుతం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు స్వయానా సోదరుడు.

గతంలో లోక్ సభ సభ్యుడిగానే కాక మంత్రిగానూ ఆనంద గజపతిరాజు పనిచేశారు. ప్రస్తుతం సింహాచలంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తగా ఉన్న ఆనంద గజపతిరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. సోదరుడి మరణవార్త విన్న అశోక్ గజపతిరాజును హుటాహుటిన ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరారు.

అలాగే ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్ వేదికగా తెలియజేయడమే కాకుండా, ఆనంద గజపతిరాజు మృతికి సంతాపం తెలుపుతూ సీఎంఓ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.