Puri Jagannadh Drugs investigationడ్రగ్స్ కేసు నేపధ్యంలో సిట్ అధికారుల ఎదుట సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ను ఓ ప్రశ్న బాగా ఇబ్బందులు పెట్టినట్లుగా మీడియా వర్గాలు ప్రసారం చేస్తున్నాయి. చాలా ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పిన పూరీ, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని కుండబద్దలు కొట్టినట్లుగా సిట్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. అయితే అంత స్పష్టతతో కూడిన పూరీ జవాబులలో ఓ ప్రశ్న మాత్రం ఇబ్బందులు పెట్టినట్లుగా టాక్.

కెల్విన్ తో పరిచయం ఎలా ఏర్పడింది? అన్న ప్రశ్నకు ‘ఓ ఫ్రెండ్ ద్వారా’ అంటూ జవాబిచ్చిన పూరీ, అదే కెల్విన్ “జ్యోతిలక్ష్మి” సినిమా ఆడియో వేడుకలో ఎందుకు ఉన్నారు? అనే దానిపై తడబడినట్లుగా కధనాలు ప్రసారం అవుతున్నాయి. అలాగే కెల్విన్ తో ఆర్ధిక వ్యవహారాల గురించి బ్యాంకు స్టేట్మెంట్లను పూరీ ముందు పెట్టగా, అవన్నీ ‘జ్యోతిలక్ష్మి’ ఆడియో ఈవెంట్ కోసం కెల్విన్ కు తాను డబ్బులు ఇచ్చినట్లుగా తెలిపారు. అయితే ఈ జవాబుతో సిట్ అధికారులు ఏ మాత్రం సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.

అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం పూరీ చెప్పిన సమాధానాలతో అధికారులే అవాక్కైనట్లుగా, బహుశా ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ముందుగానే అంచనా వేసుకుని పూరీ వచ్చారా? అన్న ఆలోచనలు చేసారని తెలుస్తోంది. సాయంత్రం అయిదు గంటలకల్లా విచారణ ముగుస్తుందని భావించిన తరుణంలో… అయిదు దాటి మరో రెండు గంటలు తడిచినా విచారణ కొనసాగుతుండడం సర్వత్రా ఉత్కంఠతను రేపుతోంది. ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విచారణ విడిచి వెళ్లిపోయినప్పటికీ విచారణ కొనసాగుతోంది.