ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’ విషయంలో బిజెపి అనుసరిస్తున్న వైఖరి పట్ల రాష్ట్ర ప్రజలకు చీదరింపు భావన ఏర్పడేలా చేస్తోంది మోడీ సర్కార్. ఇప్పటికే వివిధ సందర్భాలలో ‘ప్రత్యేక హోదా’పై మాట మార్చిన బిజెపి సర్కార్, తాజాగా మరోసారి ఏహ్యభావన కలిగేలా బిజెపి తరపున వకాల్తా పుచ్చుకున్న పురందేశ్వరి గారు ప్రసంగించారు.
ఓ సర్కిల్ లో ఓ అయిదారు రకాల కారణాలను రాసుకుని, అవి పూర్తయిన వెంటనే మళ్ళీ మొదటి కారణాన్ని చెప్పాలనుకుంటున్నారో ఏమో గానీ, మళ్ళీ మొదటి కారణానికి వచ్చింది బిజెపి ప్రభుత్వం. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేసిన తొలినాళ్ళల్లో… ‘స్పెషల్ స్టేటస్ ను మంజూరు చేయడానికి తమకేమి అభ్యంతరం లేదని, అయితే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని’ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజాగా అవే మాటలను కాస్త మార్చి… ‘ప్రత్యేక హోదా దక్కాలంటే ఏపీ సర్కార్ 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించుకోవాల్సి ఉంటుందని’ అన్న గారి తనయురాలు, ఒకప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత బిజెపి నేత అయినటువంటి పురందేశ్వరి గారు తాజాగా చిత్తూరులో ఈ వ్యాఖ్యలు చేసారు. మరి 14వ ఆర్ధిక సంఘం అంటూ, నీతి అయోగ్ అంటూ ఇప్పటివరకు అరుణ్ జైట్లీ వర్యులు చెప్పినవన్నీ బుటకాలేనా? లేక…
ఎవరికీ తోచిన విధంగా వారు ఏపీ ప్రజలతో ఒక ఆట ఆడుకుంటున్నారా? అంటే ఎక్కువ శాతం మంది ప్రజానీకం మాత్రం రెండవ దానికే ఓటు వేస్తున్నారు. బహుశా దేశంలోనే అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం వలన, ఎన్ని మాటలు అన్నా ‘అలా పడి ఉంటారని’ బిజెపి అధిష్టానం అనుకుంటున్నదేమో..!?