Pune Vs Mumbai Indians 2017 IPL 10వరుసగా విఫలమవుతూ పరోక్షంగా జట్టు ఓటములలో భాగస్వామి అవుతోన్న మహేంద్ర సింగ్ ధోనికి – ఆ జట్టు యజమాని సంజీవ్ గోయంకా మధ్య ‘కోల్డ్ వార్’ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ధోనిని ఉద్దేశిస్తూ గోయంకా చేసిన పలు ట్వీట్లపై అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా దాడి చేసిన సంగతులు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే శనివారం నాడు జరిగిన మ్యాచ్ లో ధోని బ్యాటింగ్ ప్రతిభ వలనే పూణే జట్టు విజయం సాధించడంతో గోయంకా ‘యూ టర్న్’ తీసుకోక తప్పలేదు.

ధోని బెస్ట్ ఫినిషర్ అని, జార్ఖండ్ డైనమేట్ ఫాంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని, మ్యాచ్ లను ఫినిష్ చేయడంలో ధోనిని మించిన మొనగాడు లేదంటూ ట్వీట్లు చేసారు. గోయంకా ‘యూ టర్న్’పై అభిమానులు హర్షం వ్యక్తం చేయగా, ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న అంబటి రాయుడు మాత్రం ఏకంగా ఓ కౌంటర్ వేసాడు. ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారంటూ కితాబిచ్చిన రాయుడు, గోయంకాకు ఎవరైనా ఒక అద్దం బహుమతిగా ఇవ్వాలంటూ కోరారు. అంటే పరోక్షంగా నీ ముఖాన్ని అద్దంలో చూసుకోమని… గోయంకాకు రాయుడు చెంపపెట్టు సమాధానం ఇచ్చారన్న మాట!