PSV Garudavega making with 25 crores budget‘అంకుశం’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో వెలిగిపోయిన రాజశేఖర్ కు ఇటీవల కాలంలో హిట్ అన్న పదం విని కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. నిజానికి గత కొంతకాలంగా బయట చిత్రాల కంటే సొంత చిత్రాలతోనే సమయం గడుపుతోన్న రాజశేఖర్, కాస్త గ్యాప్ ఇచ్చి “గరుడ” సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గుంటూరు టాకీస్’ ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బడ్జెట్ వింటే, సినీ జనాలే నోరెళ్ళ బెడుతున్న పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఏ మాత్రం మార్కెట్ లేనటువంటి రాజశేఖర్ పై దాదాపుగా 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మాణం జరుపుకుంటోంది. హైదరాబాద్, ముంబై, బ్యాంకాక్, జార్జియా వంటి వివిధ లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాపై దర్శక నిర్మాతలు పూర్తి నమ్మకంతో, నాణ్యతా లోపం లేకుండా ఉండాలని, ఇంత భారీ పెట్టుబడికైనా వెనుకాడడం లేదని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ పై ఎంత నమ్మకంతో ఉన్నారంటే… ఇటీవల హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల సూపర్ విజన్ తో కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసారంటే, ఖర్చుకు వెనుకాడడం లేదన్న విషయం అవగతమవుతోంది. ‘విశ్వరూపం’ సినిమాలో కమల్ హాసన్ సరసన నటించిన పూజాకుమార్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సన్నీ లియోన్ పై ఐటెం సాంగ్ ను కూడా ఇటీవలే చిత్రీకరించారు. అయితే రాజశేఖర్ కు ఇంత బడ్జెట్ అవసరమా? అన్న టాక్ అయితే మాత్రం అన్ని వర్గాల నుండి యూనివర్సల్ గా వ్యక్తమవుతోంది.