Amaravati Designs Chandrababu Naiduనవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటితో సరిగ్గా రెండేళ్లు. నాడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరుగగా, 2050 నాటికి ప్రపంచంలోని మేటి నగరాల్లో ఒకటిగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. అయితే ఈ రెండేళ్ల నుండి అమరావతిలో ఏం జరుగుతోంది? అంటే…

రాజధానికి గుండెకాయ లాంటి సీడ్ క్యాపిటల్‌ 1694 హెక్టార్లలో నిర్మించే విధంగా ప్లానింగ్ సిద్ధం చేసారు. ఐదు దశల్లో అభివృద్ధి చేయనున్న దీనిలో మూడు లక్షల మంది జనాభా నివసించేలా నిర్మించనున్నారు. సీడ్ క్యాపటిల్ అభివృద్ధికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రధాన పరిపాలనా నగరానికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే ఓకే అయినట్టు తెలుస్తోంది.

అయితే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్‌ లోని నార్మన్ ఫోస్టర్ సంస్థ కార్యాలయానికి వెళ్లి డిజైన్లను పరిశీలించనున్నారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కేంద్రం కేటాయించిన 15 సంస్థలకు ఇప్పటి వరకు స్థలాలు కేటాయించకపోవడంతో వాటి కార్యకలాపాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు.

ఇక మంగళగిరి వద్ద 193 ఎకరాల విస్తీర్ణంలో 1684 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ‘ఎయిమ్స్’ పనులను వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్ఆర్ఎం, విట్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు అమరావతిలోని తమ యూనివర్సిటీల్లో ఇప్పటికే తరగతులను ప్రారంభించాయి. మంగళగిరిలో పై డేటా సెంటర్, పై కేర్ సర్వీసులు ఏర్పాటయ్యాయి. రాజధాని ప్రాంతానికి చేరుకునేలా ఏడు సీడ్ యాక్సెస్ రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మంగళగిరిలో 53 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.