priyanka-gandhi-participating-2019-elections-mpకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీ వ్యవహారాల్లో సైతం ఇంతకు ముందులా చురుగ్గా వ్యవహరించ లేకపొతున్నారు. దీంతో ప్రస్తుతం అన్ని విషయాలను రాహుల్ గాంధీనే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి సోనియా తప్పుకుంటారనే వార్తలు ప్రధానంగా హల్చల్ చేస్తున్నాయి.

ఎంపీగా ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్ బరేలి నియోజకవర్గం నుంచి 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఓ జాతీయ దినపత్రిక కధనాన్ని ప్రచురితం చేసింది. అనారోగ్య కారణాల వలన కీలక బాధ్యతల నుంచి సోనియాగాంధీ తప్పుకోవాలని భావిస్తున్నట్టు సదరు పత్రిక కథనం సారాంశం. మరోవైపు, ప్రియాంకపై రాహుల్ ఆధారపడటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.

ఇప్పటికే సోనియా చూసుకుంటున్న పనులను ప్రియాంక చాలావరకు చూసుకుంటున్నారు. రాహుల్ కార్యాలయం తెరవెనుక కార్యకలాపాలను కూడా ప్రియాంక చూసుకుంటున్నారనేది పొలిటికల్ వర్గాల టాక్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంలో కూడా ప్రియాంకనే కీలకపాత్ర పోషించారు. రాజకీయాల్లో ప్రియాంక మరింత మెరుగైన పాత్ర పోషించాలనుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రకటించింది.

ఎస్పీతో పొత్తు వ్యవహారంలో క్రెడిట్ ఆమెదేనని కూడా స్పష్టం చేసింది. యూపీ ఎన్నికల్లో కూడా రాహల్ తో కలసి, ప్రియాంక ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. అఖిలేష్ భార్య డింపుల్ తో కలసి కూడా ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు వర్తమాన రాజకీయాల టాక్. బహుశా యూపీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎత్తుగడ ఫలిస్తే… ప్రియాంక గాంధీకి పట్టాభిషేక ముహూర్తం అతి త్వరలోనే ఉండవచ్చని బలంగా వినపడుతున్న సమాచారం.