వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేస్తూ… ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల సందర్భంగా, ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పైకి ఎక్కి నిరసన తెలపడమే కాక, స్పీకర్ పోడియం వద్ద కూడా గందరగోళం చేసిన ఉదంతం తెలిసిందే.
అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పైకి ఎక్కి నిరసన తెలపడాన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలోనే, వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. ఒక్కోరోజు ఆరుగురు ఎమ్మెల్యేలు కమిటీ ముందు హాజరై, తమ ప్రవర్తన పట్ల వివరణ ఇవ్వాలని నోటీసులో కమిటీ ఆదేశించింది. ప్రత్యేక హోదాకు సంబంధించి సభలో ప్రత్యేక చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ వీరు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.
ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల జాబితాను పరిశీలిస్తే… కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాశం సునీల్ కుమార్, ముత్యాలనాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చెర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. వీరి వివరణ సరిగా లేకుంటే… రోజా మాదిరే ఈ 12 మంది ఎమ్మెల్యేలు కూడా పయనించే అవకాశముందంటూ రాజకీయ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్.