మెట్రో కు కావాల్సిన సేఫ్టీ క్లియరెన్స్ రావడంతో 28న తలపెట్టిన మెట్రో ప్రారంభోత్సవంకు ప్రధాని కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ఈనెల 28న, మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 3.25కి మియాపూర్ మెట్రోరైల్ స్టేషన్కు చేరుకుంటారు.
మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్ నుంచి కూకట్పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్కు వస్తారు. తర్వాత స్టేషన్ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధానితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం మియాపూర్ – నాగోల్ మెట్రో రైల్ రూట్ ప్రజలకు ఓపెన్ అవుతుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు.