దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికల తంతు జరుగుతూనే ఉంటోంది. దీంతో అభివృద్దికి ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి. పార్లమెంటుకు ఓ సారి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు మరోసారి… ఇక ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న వైనంపై గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఓ సరికొత్త ప్రతిపాదనను సిద్ధం చేశారు.
‘ఒక దేశం… ఒకే ఎన్నిక’ పేరిట చేసిన ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే… దేశంలో పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగానికి చెక్ పడటంతో పాటు ఐదేళ్ల పాటు అభివృద్ధికి ఆటంకాలు ఎదురుకాబోవు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సరేనన్నాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ ప్రతిపాదనకు ఓటేశారు. దీంతో ప్రధాని మోడీ ఆలోచన త్వరలోనూ కార్యరూపం దాల్చనుందని రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోన్న సమాచారం.