తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలంటే.. ఈ సారి తెలంగాణ సెంటిమెంట్ ఒక్కటి సరిపోదని కేసీఆర్ తెలుసుకున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ నుంచి తనను తాను కాపాడుకోవాలంటే.. ప్రశాంత్ కిషోర్ సాయం తప్పదని ఆయనతో ఒప్పందం చేసుకున్నారు. గతంలో బీజేపీని ఎదుర్కుని ప్రాంతీయ పార్టీలను గెలిపించన చరిత్ర ఉండటంతో ఆయన మీద అపారమైన నమ్మకంతో ఉన్నారు కేసీఆర్. అయితే పీకే పేరు చెబితేనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బెంబేలెత్తిపోతున్నారు.
ఎందుకంటే గతంలో ఏపీలో అలాగే పశ్చిమ బెంగాల్ లో ఇలాగే పీకే రంగంలోకి దిగితే.. ఏ పార్టీ నుంచి అయితే పీకే వ్యవహరిస్తారో ఆ పార్టీలో అనేక సర్వేలు నిర్వహించారు. ఏపీలోని వైసీపీలో చాలామందిపై పీకే టీమ్ సర్వేలు చేసి వ్యతిరేకత ఉందంటూ చెప్పడంతో.. వారిని జగన్ పక్కన పెట్టేశారు. అయితే ఇప్పుడు టీఆర్ ఎస్ తరఫున రంగంలోకి దిగుతున్న పీకే టీమ్.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తోంది.
ఎమ్మెల్యే మీద నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి.. వ్యతిరేకత ఉందా, మళ్లీ పోటీ చేస్తే గెలుస్తారా.. లేదంటే ఏ పార్టీ వ్యక్తి గెలిచే అవకాశం ఉంది అనే అంశాలపై సర్వేలు నిర్వహిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో 10 నుంచి 12మంది పీకే టీమ్ సభ్యులు సర్వేలు చేస్తున్నారు. వీటన్నింటిపై అభిప్రాయాలు సేకరించి కేసీఆర్కు నివేదిక అందించనునున్నారు. ఇప్పుడు టీఆర్ ఎస్ లో ఉన్న 102మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 64మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రధానంగా వీరి మీదనే వ్యతిరేకత ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. తమ మీద వ్యతిరేకత ఉందని కేసీఆర్కు నివేదిక ఇస్తే.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కష్టమేనా అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం కోసం తమ సీటును లాగేసుకుంటారా అంటూ తమ వర్గం దగ్గర వాపోతున్నారంట.
చాలామంది ఎమ్మెల్యేలు గ్రూపులుగా మారి ఇదే విషయంపై తీవ్రంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ వ్యతిరేకంగా నివేదికలు వస్తే.. పార్టీలో ఏం చేయాలనే దానిపై చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కలిసికట్టుగా వ్యూహాలు రచిస్తున్నారంట. ప్రతిపక్షాలకు కౌంటర్లు వేయడం మానేసి.. సిట్టింగ్ సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో బిజీ అయిపోయారని తెలుస్తోంది. ఇలా పీకే టీమ్ వచ్చి ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.