ఎన్నో రాష్ట్రాలలో ఎందరినో అధికారంలోకి తెచ్చిన కింగ్ మేకర్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కింగ్ మారాలనుకుంటున్నారా? ఆవిధంగానే ప్రశాంత్ కిషోర్ సంకేతాలు ఇస్తున్నారు. జేడీయూ పార్టీలో ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ నిబంధనలకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేడీయూ బీహార్ లో బీజేపీ మిత్ర పక్షంతో అధికారంలో కొనసాగుతున్నప్పటికీ, ప్రశాంత్ కిషోర్ ఇవేవీ పట్టించుకోకుండా, బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జేడీయూ ఆయనను బహిష్కరించింది.
ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జేడీయూ, బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ లో కీలక అడుగువేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు 100 రోజుల పాటు రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు. ఈ మేరకు ‘బాత్ బిహార్ కీ’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది యువత అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 20 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
దీనితో ప్రశాంత్ కిషోర్ బీహార్ లో సొంతంగా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నట్టుగా ఉంది. ఆయన వేరే ఏవైనా పార్టీలలో జాయిన్ అవతారా లేదా సొంత కుంపటి పెడతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు కింగ్ మేకర్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కింగ్ గా మారాలనుకుంటున్నారా?