Pranay Murder- case Maruthi Rao Suicideమిర్యాలగూడలో రెండేళ్ల క్రితం జరిగిన పరువు హత్య ఎటువంటి సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. ప్రణయ్ హత్యా కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మ హత్య చేసుకుని చనిపోవడం ఈరోజు మరో సంచలనానికి దారి తీసింది. కాసేపటిక్రితం ఉస్మానియా లో ఆయన బాడీకి పోస్టు మోర్టమ్ జరిపారు.

విషం తాగడం వల్లే చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు. తన కుమార్తె తనకు దూరమయ్యిందనే మనస్తాపంతో ఆత్మ హత్యకు పాల్పడ్డారని వార్తలు రాగా వాటితో పాటుగా ఇప్పుడు మరిన్ని అనుమానాలు బయటకొస్తున్నాయి. కూతురు ఎలాగూ దూరం అయిపోయింది కనుక తన కొడుకుల పేరిట ఆస్తులు రాయాల్సిందిగా మారుతీ రావు తమ్ముడు ఒత్తిడి చెయ్యడం వల్లే ప్రాణాలు తీసుకున్నారని ఇంకొందరు అంటున్నారు.

కొందరేమో కూతురితో దొంగ సాక్ష్యం చెప్పే ప్రయత్నం బెడిసికొట్టడం… ఛార్జ్ షీట్ ఇంకో రెండు రోజులలో పడటం ఖాయం అవ్వడంతో శిక్ష తప్పదని తీవ్ర ఒత్తిడికి గురయ్యి ఇటువంటి పనికి పాల్పడ్డాడని ఇంకొందరు అంటున్నారు. “గిరిజా నన్ను క్షమించు…. అమృతా అమ్మ దగ్గరకు వచ్చేయ్,” అని చివరిసారిగా రాసిన లేఖలో ఉంది.

గిరిజ మారుతీరావు సతీమణి. మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. మారుతీరావు మరణవార్త అఫిషియల్‌గా తమకు సమాచారం లేదని తెలిపారు. నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్న సంగతి టీవీలో చూసే తెలుసుకున్నామని అమృత తెలిపారు. ప్రణయ్‌ హత్య జరిగిన తర్వాతినుంచి తండ్రి తనతో టచ్‌లో లేడని పేర్కొన్నారు. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు.