‘మా’ ఎన్నికలలో రాజకీయ చొరబాటు పుణ్యమా అంటూ ఇండస్ట్రీలో వైవిధ్యాలు మీడియా వేదికలుగా బహిరంగమైన విషయం తెలిసిందే. వైసీపీ అండదండలతో మంచు విష్ణు విజయాన్ని సొంతం చేసుకుని, తదుపరి మోహన్ బాబు – విష్ణులు వచ్చి జగన్ ను కలిసి తమ విధేయతను చాటుకున్నారు.
మరి ప్రస్తుతం వైసీపీ రాజకీయంగా ఏపీలో కార్నర్ అయ్యింది. అసెంబ్లీ ఘటనతో వైసీపీపై విమర్శలు వెల్లువలాగా వస్తుండగా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు.
‘బాగా చెప్పావు తారక్’ అంటూ ఈ వీడియోకు ప్రకాష్ రాజ్ కూడా కితాబు ఇచ్చేసారు. దీంతో జూనియర్ అభిప్రాయమే తన భావనగా ప్రకాష్ రాజ్ చెప్పినట్లయింది. కానీ ఇప్పటివరకు మంచు ఫ్యామిలీ ఏ రూట్ ను తీసుకున్నారో స్పష్టత లేదు.
రాజకీయంగా వైసీపీకి అత్యంత చేరువ అయిన ‘మోహన్ బాబు అండ్ కో’ జగన్ పార్టీని సమర్థిస్తారా? లేక చేసిన విమర్శలు సరికావని ఖండిస్తారా? అనేది సినీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మంచు ఫ్యామిలీలో మనోజ్ రూటే సపరేట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.