బెంగళూరు కేంద్రంగా నడుస్తోన్న ‘పోస్ట్కార్డు’ న్యూస్ వెబ్సైట్పై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. తన గౌరవానికి భంగం కలిగించేలా అమర్యాదకరమైన రీతిలో ఆ వెబ్సైట్ కథనాలను ప్రచురిస్తోందని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరులోని కబ్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్యకు గురైన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించకపోవడాన్ని తాను తప్పుపట్టానని, అప్పటినుంచి ఆ వెబ్సైట్ తనపై ఇలా న్యూస్ రాస్తోందని ఆయన చెప్పారు. దీంతో పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే పోలీసులు సదరు వెబ్సైట్ సహ వ్యవస్థాపకుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో తన ఫిర్యాదుపై కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్న ఆశతో తాను ఫిర్యాదు చేస్తున్నానని చెప్పారు. ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్ట్కార్డ్ వెబ్సైట్ నిర్వాహకుడు మహేశ్ విక్రమ్ హెగ్డే కథనాలు రాయడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఓ జైన గురువుపై ముస్లిం యువకుడు దాడి చేసినట్లు ఆయన పేర్కొని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు పాలనలో తమ రాష్ట్రంలో ఏ మతానికి చెందిన వారికీ రక్షణ లేదని ఆయన వార్తలు రాయడంతో కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు.