Sye Raa Narasimha Reddyమెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న “సైరా” సినిమా ఎంతటి ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో చిత్రీకరణ జరుపుకోనున్న సినిమాగా ఇప్పటికే టాక్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారిన ఈ సినిమాలో చిరుకు సరసన నయనతార నటిస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ సంబంధించిన స్టిల్స్ గతంలో అమితాబ్ విడుదల చేయగా, అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిన వైనం నెటిజన్లకు ఎరుకే.

తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ కూడా వచ్చి చేరబోతోందని తెలుస్తోంది. ‘కంచె’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రజ్ఞా జైస్వాల్, ఆ తర్వాత మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, సాయిధరమ్ తేజ్ వంటి హీరోలతో నటించినప్పటికీ, ఒక్క బ్రేక్ కూడా రాలేదు. మంచు విష్ణుతో చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’ అనేక వాయిదాల తర్వాత, ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో… ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ‘సైరా’కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

‘సైరా’ సినిమాలో తాను నటించే అవకాశాలు ఉన్నాయని, త్వరలోనే ఈ విషయంపై ఓ అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పిన ప్రజ్ఞా మాటల్లో స్పష్టత ప్రస్పుటంగా కనపడుతోంది. బహుశా చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్రకటన కోసం ప్రజ్ఞా వేచిచూస్తున్నట్లుగా కనపడుతోంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ తారలతో సిల్వర్ స్క్రీన్ అంతా నిండుదనంగా మారిన ‘సైరా’లో ఈ బ్యూటీ కూడా చేరితే, వీక్షకులకు అంతకు మించిన కన్నులవిందు ఏముంటుంది?