యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని తొలి పాట వచ్చేసింది. ‘సైకో సయ్యాన్.. ’ అంటూ సాగే ఈ పాట ప్రభాస్ అభిమానులను నిరాశపరచింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి స్వరపరిచిన ఈ పాట బీట్ బావుంది అయితే లిరిక్స్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాయి. కారణం ఈ పాటకు మొదట హిందీ లిరిక్స్ రాసి దానికి ట్యూన్ కట్టారు. ఆ తరువాత తెలుగు రైటర్ శ్రీజో ఆ ట్యూన్ కి లిరిక్స్ రాశారు.
సహజంగా పరభాషా చిత్రాలు తెలుగులోకి అనువదించినప్పుడు అటువంటివి చేస్తారు. అయితే ట్యూన్ కి తగ్గ లిరిక్స్ రాయడం శ్రీజో వల్ల కాలేదు. దానితో తెలుగు పాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ కూడా నీరసంగా కనిపించాడు… పాట బీట్ కు తగ్గట్టు ఆయన జోష్ లేకపోవడం అభిమానులను నిరాశపరచింది. పాటలో శ్రద్ధా కపూర్ డాన్స్ ఇరగదీస్తుండగా ప్రభాస్ తో చిన్న చిన్న స్టెప్స్ వేయించి పనికానిచ్చేశారు. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది. సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై సినిమా నిర్మితమవుతుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి ప్రయత్నం నిరాశపరచడంతో టీం తరువాతి ప్రొమోషన్ల విషయంలో జాగ్రత్త పడాలి.