పబ్లిసిటీ అంశంలో పూర్తిగా విఫలమైన “రాధే శ్యామ్” చిత్ర నిర్మాణ సంస్థను ప్రభాస్ అభిమానులతో సహా సినీ ప్రేక్షుకులు కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోల్స్ తో ట్విట్టర్ అండ్ ఇంస్టాగ్రామ్ ఖాతాలు నిండిపోయాయి. ఈ ట్రోలింగ్ ఎక్కడి వరకు వెళ్లిందంటే… ఏకంగా యువీ క్రియేషన్స్ పై హైదరాబాద్ సిటీ పోలీస్ కు కంప్లైంట్ చేసేవరకు!

రెండు వాయిదాల అనంతరం ఫైనల్ గా విడుదలైన ‘ఈ రాతలే’ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. జస్టిన్ ప్రభాకరన్ అందించిన మ్యూజిక్ తో పాటు కృష్ణకాంత్ అందించిన సాహిత్యం బాగుంది. బహుశా సినిమాలో విజువల్ గా మరింత ఆకట్టుకుంటుందేమో అన్న విధంగా ఈ పాట ఉంది. ఆడియో పరంగా ఎలాంటి అనుభూతిని పంచుతున్నా, ఈ లిరికల్ వీడియోలో ప్రభాస్ – పూజా హెగ్డేల బదులు చూపించిన విజువల్స్ మాత్రం ఫ్యాన్స్ ను నిరుత్సాహ పరుస్తున్నాయి.

గ్రాఫిక్స్ లో ప్రభాస్ అండ్ పూజలను చూపించిన విధానం అభిమానులకు ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఇన్ని వాయిదాల తర్వాత కూడా మాకు ఈ తోలుబొమ్మలు ఎందుకు? అన్నది యంగ్ రెబల్ స్టార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వెలుబుచ్చుతున్న ఆవేదన. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో వెనుకబడిన యువీ క్రియేషన్స్ మున్ముంది అయినా జాగ్రత్తలు వహిస్తుందో… లేక ఇలాగే అభిమానుల ట్రోలింగ్ కు గురవుతుందో చూడాలి..!