గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే బాధ్యత అన్నట్టు అయిపోయింది కరోనా సమయంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పరిస్థితి. ఇప్పటికే విడుదలకు రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటో తెలీదుగానీ సంక్రాంతికి డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు.
పవన్కల్యాణ్ నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్, మహేశ్ ‘సర్కారువారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నట్టు ప్రకటించేశాయి. ప్రకటన వచ్చిందే తడవుగా ఆయా హీరోల ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు.
మా హీరోకు ఆ డేట్ అంటే మా హీరోకి ఆ డేట్… మా వాడి దెబ్బకు మీ వాడు అవుట్… గతంలో క్లాష్ అయినప్పుడు మా వాడు నిన్ను మట్టికరిపించాడు… అప్పుడు సంగతి సరే ఇప్పుడు చూసుకుందాం… ఇలా చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న ఫ్యాన్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి.
అయితే వీరందరినీ దూరం నుండి చూస్తున్న సగటు సినిమా అభిమానికి మాత్రం వీరు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలీదు. కరోనా కారణంగా రేపు ఏం జరుగుతుందో ఈ రోజు చెప్పడం కష్టంగా మారింది. సంక్రాంతి అంటే ఐదు నెలల తరువాతి మాట… అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.
పరిస్థితులు పగపడితే షూటింగ్లు పూర్తి కావడం కూడా కష్టమే. ఒకవేళ కరోనా కనికరించినా ఇన్ని పెద్ద సినిమాలకు థియేటర్లు దొరుకుతాయో లేదు తెలీదు. ఇన్ని సమస్యల మధ్య… అసలు దేనికోసం కొట్టుకున్నారు వీళ్ళంతా? అనిపించకమానదు.