posani-krishna-murali-pawan-kalyanసూటిగా సుత్తి లేకుండా మాట్లాడడంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ శైలి అందరికీ తెలిసిందే. పోసాని మాట కరకు గానీ, మనసు మంచిది అని సినీ జనాలు చెప్పుకుంటుంటారు. అలాంటి పోసాని, తాజాగా మెగా బ్రదర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లపై స్పందించారు. ముందుగా మెగాస్టార్ గురించి వ్యాఖ్యానిస్తూ… “చిరంజీవి చాలా నిజాయితీపరుడు. గతంలో నాకు ప్రజారాజ్యం పార్టీ సీటు ఇచ్చినపుడు ఒక్క రూపాయి కూడా నా దగ్గర తీసుకోలేదు. నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే నాడు ఓడిపోయాను” అని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు పోసాని.

చిరంజీవి తన ‘ప్రజారాజ్యం’ పార్టీని మళ్లీ ప్రారంభిస్తే, ఆయన వెంట నడవడానికి తాను మళ్లీ సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పారు. ఇక, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ… ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే… ఆ వ్యక్తి నిజాయతీ పరుడైనా అయి ఉండాలి లేదా చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అంటూ దాటవేసే ధోరణిని ప్రదర్శించారు. ‘జనసేన’ పార్టీపై కూడా స్పందిస్తూ… ఆ పార్టీ గురించి ఇంతవరకూ తనకేమీ అర్థం కాలేదని, అర్థమయ్యాక దీనికి సమాధానం చెబుతానని తేల్చేసారు పోసాని.

పనిలో పనిగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై తీవ్రంగా పోసాని కృష్ణ మురళి మండిపడ్డారు. పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడైతే, ఆ రోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని ఘాటుగా స్పందించారు పోసాని.