తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి, ఒకప్పటి టాప్ హీరోయిన్ జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాలా దర్శకత్వం వహించిన ‘నాచియార్’ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకుముందే వివాదం చెలరేగింది. పలు సంఘాలు చేపట్టిన నిరసనలతో… ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర యూనిట్ బీప్ చేసింది. ఈ సినిమా ఈ శుక్రవారం నాడు విడుదల అయింది.
అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ‘మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే’ అనే డైలాగ్ ఉంది. జ్యోతికకు చెందిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంభాషణలను వెంటనే తొలగించాలని… జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.