తెలుగు బుల్లితెరను ఏలుతున్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో ‘జబర్దస్త్, పటాస్’ షోలు ముందు వరుసలో ఉంటాయి. ఈ షోలలో యాంకర్లుగా నిర్వహిస్తున్న అనసూయ, రష్మి, శ్రీముఖిలు తమ హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో, హావభావాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. ఇక సదరు షోలలో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీకి కొదవలేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సదరు కార్యక్రమాలపై వివిధ సందర్భాలలో విమర్శలు వ్యక్తమైనప్పటికీ, ప్రజాధరణ చూరగొనడంతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి.
కానీ, వాటికి బ్రేక్ పడే విధంగా “జబర్దస్త్, పటాస్” షోలపై పలు అభ్యంతరాలు చెబుతూ హైదరాబాద్ లోని బాలానగర్ పోలీస్ స్టేషన్లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. సదరు రెండు కార్యక్రమాల్లో పంచ్ లు, సెటైర్ల కోసం వాడుతున్న పదజాలం ఇబ్బందికరంగా ఉందని, సభ్య సమాజానికి హాని చేసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయని, కొన్ని ఎపిసోడ్ లలో అశ్లీల, అనైతిక దృశ్యాలు ఎక్కువగా ఉంటున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేసారు.
మరోవైపు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి జబర్దస్త్ ప్రోగ్రాంలో మహిళలను, చిన్న పిల్లలను కించపరిచే కార్యక్రమాలను ఎమ్మెల్యే రోజా ప్రోత్సహించడం చాలా బాధాకరమని, సిగ్గుచేటు విషయంగా అభిప్రాయపడ్డ దివాకర్, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే విషయంపై రోజా పునరాలోచించుకోవాలని కోరారు. ఎదుటి వ్యక్తిలను పంచ్ ల పేరుతో తిడుతున్నారని, ఆ డైలాగులు విని ప్రేక్షకులు నవ్వుకుని ఆనందించే స్థాయికి దిగజారిపోవడమేంటని, ఒకరిని తిడుతోంటే మరొకరు ఆనందించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసారు.