అనుకున్నట్టుగానే మేఘా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకున్నటు తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్లో ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రాల టెండర్ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది.ఈ పనులకు రూ.4,987 కోట్లను ఇనిషియల్ బెంచ్ మార్క్ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా.. మేఘా సంస్థ ఒక్కటే బిడ్డింగ్ లో పాల్గొంది.
రూ.4,358 కోట్లకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది. అంచనా విలువకంటే 12.6శాతం తక్కువగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ కోట్ చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని ప్రభుత్వ వాదన. అయితే ఒక పథకం ప్రకారమే కేసీఆర్ కు బాగా దగ్గరైన కంపెనీకు కట్టబెట్టారని ప్రతిపక్షాల ఆరోపణ.
ఉద్దేశపూర్వకంగా వేరే కంపెనీలు పాల్గొనకుండా నియమనిబంధనలు మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అనుకూలంగా రూపొందించారని టీడీపీ ఆరోపిస్తుంది. అయితే అధికార పక్షం మాత్రం ఇది తమ ప్రభుత్వ విజయమని, అవినీతికి తావు లేకుండా ఖజానాకు 700 కోట్ల మేర డబ్బు మిగిల్చామని చెబుతుంది.
గతంలో ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్ ను బిడ్డింగ్ కు అనుమతించినా వారు పాల్గొనలేకుండా నియమనిబంధనలు రూపొందించారట. మరోవైపు నవయుగ ఇప్పటికే దీని మీద కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కోర్టు ఇప్పటివరకు కంపెనీకి అనుకూలమైన తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం రీ-టెండరింగ్ కే మొగ్గు చూపింది.