Pink Diamond - High Court of Andhra Pradeshపింక్‌ డైమండ్‌ విషయంలో మళ్లీ విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ డైమండ్‌ అసలు ఉందా.. లేదా.. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన పింక్‌ డైమండ్‌, జెనీవాలో వేలం వేసిన పింక్‌ డైమండ్‌ ఒకటో కాదో తేల్చేందుకు విచారణ జరపాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి వై. విద్యాసాగర్‌ పిల్‌ వేశారు.

దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్‌ డీపీ వాద్వా నేతృత్వంలోని కమిటీ పింక్‌ డైమండ్‌కు సంబంధించి వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నివేదిక ఇచ్చిందని.. మరో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.జగనాథరావు నేతృత్వంలోని కమిటీ 1952 నుంచి ఇప్పటివరకు టీటీడీ రికార్డులో పింక్‌ డైమండ్‌ ప్రస్తావనే లేదని పేర్కొందని కోర్టు తెలిపింది.

ఈ కమిటీల నివేదికలు పరిశీలించాక ఈ వ్యవహారంపై మరోసారి విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెల్లడించింది. పింక్ డైమండ్ వ్యవహారం శ్రీవారి సన్నిధిలోని అప్పటి ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు తెరమీదకు తెచ్చారు.

చంద్రబాబు హయాంలో మాయం అయినట్టుగా ఆయన మీడియా ముందు మాట్లాడటంతో అప్పటి ప్రతిపక్షం దానిని గట్టిగా వాడుకుని చంద్రబాబు ప్రభుత్వం పై బురద చల్లింది. విజయసాయి రెడ్డి వంటివారైతే ఏకంగా చంద్రబాబు ఇంట్లో సోదా చేస్తే స్వామివారి నగలు దొరుకుతాయి అని ఆరోపించారు. అప్పట్లో టీడీపీ ఆ బురద కడుక్కోలేక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కనీసం ఇప్పుడైనా ప్రజలకు తెలిసేలా చెప్పుకుంటారా అని టీడీపీ అభిమానులు అంటున్నారు.