కరోనా వ్యాక్సిన్ విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వ్యాక్సిన్లు ఆర్డర్ చెయ్యడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతుందని టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతుంది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. జనాభాకు తగ్గట్లుగా రాష్ట్రానికి వ్యాక్సిన్ ఎందుకివ్వరని ప్రధాని మోదీకి ఘాటుగా ఒక ఉత్తరమైనా చంద్రబాబు రాయగలిగారా అని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
“వ్యాక్సిన్లను నియంత్రిస్తుంది, రాష్ట్రాలకు కేటాయిస్తోంది మోదీ ప్రభుత్వమే కదా? మరి రాష్ట్రంలో ప్రజలెంతమంది ఉన్నారు, మీరెన్ని వ్యాక్సిన్లు కేటాయించారంటూ మోదీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మోదీ ప్రభుత్వం సమృద్ధిగా డోసులు సరఫరా చేస్తే రోజుకు 10లక్షల మందికి వ్యాక్సిన్ వేయగలం,” అంటూ చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు సరే… అసలు మోడీకి మంత్రిగారు కోరుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా ఒక్క లేఖైనా రాసిందా? ప్రజల పట్ల బాధ్యత ప్రభుత్వానికి ఎక్కువ ఉంటుందా లేక ప్రతిపక్షానికి ఉంటుందా? మోడీ జోలికి మేము వెళ్ళాము… మీరు వెళ్లొచ్చు కదా? అన్నట్టు ఉంది ఇది. టీడీపీకి జగన్ శత్రువు అయితే మోడీ జోలికి ఎందుకు వెళ్తుంది?
ఇక ఆసుపత్రులలో పడకల కొరత మీద కూడా సదరు మంత్రిగారు అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. “ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ఆసుపత్రులకు వస్తున్నారు. అలాంటి వారికి వెెంటనే వైద్యం అందించాలా? ఆన్లైన్లో పడకల సంగతిని పర్యవేక్షించాలా?’ అని ప్రశ్నించారు.