ప్రజల పక్షాన ఆలోచించి, వినోదం అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న సినిమాలు అన్న తేడాలు లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధర ఉండాలన్న మహత్తరమైన నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంది, దీనిపై రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

వంద రూపాయలు పెట్టి సినిమాకు వెళ్లే ప్రజల వైపు నుండి ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. మరి వందల కోట్ల రూపాయలతో సినిమాలతో తీసి కోట్ల మంది ప్రజానీకానికి చేరువ చేసే నిర్మాతల వైపు నుండి కూడా ఆలోచించాలి అన్నది న్యాయమైన వాదన.

ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న సమస్యలలో పైరసీ అత్యంత ప్రమాదకరమైనది. గతంలో ఏ పెద్ద హీరో సినిమా విడుదలైనా, ఈ పైరసీ కాన్సెప్ట్ తోనే సగం ఇంటర్వ్యూలు సాగేవి. కానీ ఇటీవల ఏ హీరో గానీ, అలాగే ఏ ఒక్క ప్రొడ్యూసర్ గానీ పైరసీపై ఎందుకు నోరు విప్పడం లేదో జగన్ సర్కార్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఇండస్ట్రీ టాక్.

తొలివారంలో అత్యధిక షోలు ప్రదర్శిస్తూ… మొదటి మూడు రోజుల్లో టికెట్ ధరలను పెంచుకునే సౌలభ్యాలు ఉండడం వలన నిర్మాతలకు గానీ, పంపిణీ దారులకు గానీ, ఎగ్జిబిటర్లకు గానీ పెద్దగా నష్టం వాటిల్లడం లేదు. దీంతో సినిమా టాక్ తో నిమిత్తం లేకుండా మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తోంది. ఆ పైనే ఒక మాసం తిరిగి వచ్చేపాటికి ఓటీటీ రూపంలో నేరుగా సినిమానే వచ్చేస్తుంటే, పైరసీ గురించి అసలు పట్టించుకోవడమే మానేశారు.

కానీ ఏపీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ఇలాంటి అవకాశాలను నిర్మాతలకు గానీ, పంపిణీ దారులకు గానీ, ఎగ్జిబిటర్లకు గానీ కల్పించదు. తొలిరోజే ఇంటర్నెట్ లో పైరసీ రూపంలో సినిమా ప్రత్యక్షం అవుతుందన్న విషయం పబ్లిక్ అయిపోయింది. మరి దీనిని నియంత్రించే చర్యలను కూడా పేర్ని నాని గారు సవివరంగా తెలిపితే ఇండస్ట్రీ వర్గాలకు కాస్త అయినా ఊరట లభించేది కదా.

పైరసీని నియంత్రించడం సాధ్యం కాదని అభివృద్ధి చెందిన యుఎస్ వంటి దేశాలే చేతులెత్తేశాయి. అందుకే ప్రపంచమంతా ఇపుడు మొదటి రెండు వారాలకే సిల్వర్ స్క్రీన్ ను నమ్ముకున్నాయి. కానీ మన జగన్ సర్కార్ మాత్రం మళ్ళీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ రోజులకు ఇండస్ట్రీని తీసుకువెళ్లడం ఏ మాత్రం సమంజసమో ఆలోచించాలి కదా! అన్నది ఇండస్ట్రీ గోడు.