Payyavula-Keshav-TDPతెలుగుదేశం పార్టీ కీలక నేత పయ్యావుల కేశవ్. ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడితే ప్రతిపక్షం కకావికలం అయిపోతుంది. అంతటి వాగ్ధాటి కలిగిన నేత 2014 ఎన్నికలలో ఓడిపోయారు. దానితో ఆయన కొంత సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఆయన ఓటమి భారంతో పెద్దగా మీడియా ముందుకు రాలేదు. మరోసారి ఆయన ఈ ఎన్నికలలో ఉరవకొండ నుండి పోటీ చేస్తున్నారు. వైకాపా నుండి కేశవ్ చిరకాల ప్రత్యర్థి వై. విశ్వేశ్వరరావు మరోసారి పోటీ చేస్తున్నారు.

1994 నుండీ ఉరవకొండలో పయ్యావుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అప్పటి నుండి జరిగిన ఐదు ఎన్నికలలో ఆయన మూడు సార్లు గెలుపొందారు. 1994, 2004, 2009 ఎన్నికలలో కేశవ్ గెలిచారు. కేశవ్ గెలిచిన మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఉండటం విశేషం. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014లో ఆయన గెలవలేదు. దీనితో ఆయన పెద్దగా అధికారం అనుభవించింది లేదు. 2004 నుండి వై. విశ్వేశ్వరరావు పైనే పోటీ చేస్తున్నారు.

వై. విశ్వేశ్వరరావు 2004 లో వామపక్ష పార్టీ తరపున, 2009లో కాంగ్రెస్ తరపున, 2014లో వైకాపా తరపున పోటీ చేసారు. వై. విశ్వేశ్వరరావు పై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉన్నా కేశవ్ పై పెద్ద అనుకూలమైన పరిస్థితిలు కూడా లేవని అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన వివిధ సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని కేశవ్ భావిస్తున్నారు. డబ్బు కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికలలో కేశవ్ వద్ద దానికి లోటు లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఈ సారి ఆశాజనకంగానే ఉన్నారు.