గతంలో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా పయ్యావుల కేశవ్ సభలోనూ బయటా టీడీపీ వాణి బలంగా వినిపించే వారు. అయితే 2014లో పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి ఆయన ఓడిపోయారు. తరువాతి కాలంలో చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీ చేసినా ఆయన పెద్దగా యాక్టీవ్ గా లేరు. అయితే ఈసారి కేశవ్ గెలిచారు, టీడీపీ ఓడిపోయింది. మరొక్కసారి ఆయన అవసరం పార్టీకి ఉండటంతో ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్గా ఆయనను ఎంపిక చేశారు చంద్రబాబు.
ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ ఛైర్మన్గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చిన్నరాజప్ప, సీనియర్ నేత కరణం బలరాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, అనగాని సత్యప్రసాద్, గణబాబు రేసులో ఉన్నప్పటికీ వారిని కాదని పయ్యావుల కేశవ్నే చంద్రబాబు ఖరారు చేశారు. దీనితో ఆయన పార్టీలో యాక్టీవ్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు.
పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవి ఉన్నట్టే.. ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఇలా కీలకమైన పదవి కావడంతో.. చంద్రబాబు కేశవ్ కు ప్రాధాన్యత ఇచ్చినట్టే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పీఏసీ ఛైర్మన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ అవకాశాన్ని ఆయన బాగా వాడుకుని ఇప్పుడు జగన్ కేబినెట్ లో కీలక పదవి పొందారు.