ఈ నెల 20వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుక ద్వారా సృష్టించబోయే హంగామాకు వెన్యూ ఫిక్స్ అయ్యింది. మెగా ఫ్యామిలీ అంతా పాల్గొనబోయే ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు సమాచారం.
దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఆడియోలో మరో ప్రత్యేకత ఏమిటంటే… రెండు ఐటెం సాంగ్స్ గా ఆల్బమ్ గా ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ ప్రచారాన్ని మూటకట్టుకుంది. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి పాట రీమిక్స్ కావడంతో మెగా అభిమానులంతా ‘సర్ధార్’ ఆల్బమ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ‘పవర్’ చిత్ర దర్శకుడు బాబీ పేరు దర్శకుడి జాబితాలో పడనుంది. అనేక ప్రత్యేకతలు కూడుకున్న ఈ సినిమా ‘బాహుబలి’ సినిమా రికార్డులను టార్గెట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.