తెలుగు చిత్ర పరిశ్రమలోని సాటి హీరోలతో తనకెన్నడూ గొడవలు లేవని, అసలు పరిశ్రమలో ఏ హీరో కూడా మరో హీరోతో గొడవలు పెట్టుకోరని, కింది స్థాయిలో అభిమానుల మధ్యే విభేదాలుంటాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం హత్యకు గురైన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ, కోలార్ పోలీసులను సంప్రదించి అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకుంటానని తెలిపారు.
హీరోల మధ్య పోటీతత్వం మాత్రమే ఉంటుందని, అది సినిమాలకు మాత్రమే పరిమితమని, మిగతా విషయాల్లో కలిసే ఉంటామని స్పష్టం చేశాడు. మితిమీరిన అభిమానం హింసకు, హత్యలకు దారితీస్తే, అది సహించరాని నేరమవుతుందని తెలిపాడు. సినిమా హీరోలపై పెచ్చు మీరిన అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన పడేసిందని, ఇది చాలా దారుణమైన ఘటనగా పవన్ అభివర్ణించారు.
అభిమానం హద్దులు దాటి పైశాచికంగా మారడాన్ని ఎవరూ హర్షించరని, వినోద్ మరణానికి కారణమైన వారిని చట్టం ముందు దోషిగా నిలపాల్సిందేనని పవన్ కల్యాణ్ అన్నారు. హద్దులు దాటి ఒకరిని ఒకరు హత్యలు చేసుకునేంత అభిమానాన్ని ఎవరూ హర్షించరని హితవు పలికారు. ఏ హీరో అభిమానులైనా హద్దుల్లో ఉంటేనే మంచిదని వివరించారు. ఈ ఘటనతో వినోద్ తల్లికి తీరని శోకం మిగిలిందని, భవిష్యత్తులో ఎవరి అభిమానులైనా ఈ తరహా చర్యలకు దిగకుండా ఉండాలని పవన్ సూచించారు.
ఈ సందర్భంగా వినోద్ తల్లి వేదవతి మీడియాతో మాట్లాడుతూ… తన బిడ్డలాగా తోడుగా ఉంటానని, తమ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని బిడ్డను కోల్పోయిన తల్లి బాధ ఏంటో తనకు తెలుసని పవన్ అన్నారని, తనకు ధైర్యం చెప్పారని పవన్ తనతో చెప్పినట్లు తెలిపారు. తన బిడ్డ భగవంతుడి వద్దకు వెళ్లిన తరువాత కూడా ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడని, తన గుండె కోతలో పవన్ పాలు పంచుకున్నాడని, కడుపుమంటతో తన కొడుకుని చంపేశారని అన్నారు. ఇటువంటి ఘటన రాష్ట్రంలో జరగడం తొలిసారని, ఇదే చివరిసారి కావాలని కన్నీటి పర్యంతం అయ్యారు.