‘జనసేన పార్టీ స్థాపించి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ క్రియాశీలక రాజకీయాలలో పాల్గొన్నది లేదు. ఈ మూడేళ్ళల్లో పార్టీకి సంబంధించిన ఏ సమాచారం అయినా పవన్ కళ్యాణ్ నోటి వెంటే వస్తోంది. నిజానికి స్పందించింది కూడా చాలా తక్కువ సందర్భాలు అనుకోండి! అలా అరుదైన సందర్భాలలో స్పందించినప్పటికీ, అంతా తానై నిలబడ్డాడు పవన్. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అలాగే 2019లో జరగనున్న ఎన్నికల సెగ కూడా ఉధృతమవుతోంది.
దీంతో ‘జనసేన’ కూడా యాక్టివ్ కావాల్సిన పరిణామాలు ఏర్పడుతున్నాయి. కానీ మరో వైపు పవన్ కళ్యాణ్ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇదే ఆకతాయిలకు అనుకూలంగా మారింది. ‘జనసేన’ పేరును, పవన్ పేరును వినియోగించుకుని వివిధ ప్రదేశాలలో విరాళాలు సేకరించడం, అలాగే పలు మీడియా వర్గాలలో చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ అధికారిక నోట్ ను ప్రెస్ కు విడుదల చేసారు.
ఇంతవరకు ‘జనసేన’ తరపున ప్రసంగించడానికి ఏ ఒక్క వ్యక్తిని కూడా అధికారికంగా నియమించలేదని, అలాగే పార్టీకి విరాళాలు సేకరించాలని కోరలేదని, అలా చేస్తున్న వ్యక్తులను నమ్మవద్దని, ఒకవేళ అలా చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా పవన్ కోరారు. పార్టీని బలోపేతం చేస్తున్నామని, అర్హత ఉన్న వ్యక్తులకే బాధ్యతలను అప్పగిస్తామని, ప్రస్తుతం ‘జనసేన’ పార్టీకి అంతా “1 నేనొక్కడినే” అన్న భావంలో ఈ ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.