అక్కినేని నాగార్జునతో ‘ఆఫీసర్’ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో, పవన్ కల్యాణ్ ను విమర్శించేందుకు శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకోవడం ఎందుకన్న ప్రశ్న ఎదురైంది. ఎవరినైనా తిట్టగల రామ్ గోపాల్ వర్మకు, శ్రీరెడ్డికి ఉన్న సంబంధం ఏంటని, మీకు సంబంధించిన వీడియోలు ఆమె వద్ద ఉన్నాయా? అంటూ ప్రశ్నించగా, ఈ మొత్తం వ్యవహారం గురించిన తన వివరణను యూట్యూబ్ లో పోస్టు చేశానని వర్మ సమాధానం చెప్పారు.
ఈ వ్యవహారంపై ఎవరికైనా ఆసక్తి ఉంటే తన వీడియోను చూసుకోవచ్చని, తాను ఎన్నడూ దేనికీ కూడా విచారాన్ని వ్యక్తం చేయబోనని, ముందుకు వెళుతూ ఉండటమే తన కర్తవ్యమని అన్నారు. ఇక వర్మ కామెంట్లతో తాను ఫీల్ అయినట్టు పూరీ జగన్నాథ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కామెంట్లు చేయడం తన హక్కని, ఫీల్ కావడం పూరీ హక్కని వ్యాఖ్యానించారు. తాను చెప్పేవాటిని అర్థం చేసుకోలేని వాళ్లే తనను సైకో అని, పర్వర్ట్ అని అంటుంటారని, వాటిని గురించి పట్టించుకోబోనని స్పష్టం చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో రవితేజ తొడలను చూస్తున్న పవన్ కళ్యాణ్ వీడియోను చూస్తూ చేసిన కామెంట్స్ మరోసారి పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. తనకు శ్రీదేవి తొడలు ఎంత ఇష్టమో, అంతకంటే ఎక్కువగా రవితేజ ఎడమ తోడను పవన్ ఇష్టపడ్డట్లుగా కనపడుతోందని ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్స్, బహుశా వర్మకు వినోదాన్ని పంచాయోమో గానీ, ఫ్యాన్స్ కు మాత్రం ఆవేదనను మిగిల్చాయి. ఇదిలా ఉంటే మరో పక్కన పవన్ కళ్యాణ్ తిరుమలలో మూడు రోజులు ఏకాంతంగా గడిపేందుకు వెళ్లారు.
శనివారం రాత్రి 9 గంటల నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని హంపీ మఠంలో జనసేన అధినేత బసచేశారు. ఆపై ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకుని వచ్చిన ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని జనసేన వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల పాటు మఠంలోనే పవన్ ఏకాంతంగా ఉంటారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మూడు రోజుల పాటు పవన్ ఎవరినీ ప్రత్యేకంగా కలవబోరని, ఎటువంటి చర్చలూ ఉండవని తెలిపాయి. కాగా, పవన్ ఉన్నారన్న సమాచారంతో పలువురు అభిమానులు, భక్తులు హంపీ మఠం వద్దకు రావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.