ట్విట్టర్ వేదికగా భారతీయ జనతా పార్టీపై మండిపడుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ పై బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ చేస్తోన్న వరుస ట్వీట్లను చదవాలన్న ఆసక్తి తనకు లేదని, పవన్ కల్యాణ్ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
గోవధకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని, ప్రత్యేక ప్యాకేజీపై గతంలో 5 అంశాలపై సమాధానం చెప్పాలని తాము పవన్ కల్యాణ్ ను అడిగామని, ముందుగా పవన్ ఆ 5 అంశాలపై సమాధానం ఇవ్వాలని సిద్ధార్థనాథ్ అన్నారు. పలు విషయాలపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తోన్న పవన్ కల్యాణ్ రాజకీయాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
ఇప్పటివరకు వార్ ఒక వైపు నుండే వస్తుండగా, తాజాగా జరుగుతున్న పరిణామాలతో బిజెపి నుండి కూడా కౌంటర్ ఎటాక్ సిద్ధమైనట్లు కనపడుతోంది. దీంతో విమర్శల వర్షంలో పవన్ మునిగిపోవడం ఖాయమన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విమర్శలకు ‘జనసేన’ అధినేత ఎప్పుడు బదులు చెప్తాడో చూడాలి.