Pawan Kalyan Varahiజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తన రాజకీయ, ఎన్నికల ప్రచార పర్యటనల కొరకు ప్రత్యేకంగా వారాహి వాహనాన్ని తయారు చేయించుకొన్న సంగతి తెలిసిందే. అయితే అది సిద్దమై 3-4 నెలలు కావస్తున్నా దాంతో పవన్‌ కళ్యాణ్‌ రాకపోవడంతో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కోసమే పవన్‌ కళ్యాణ్‌ వెనక్కు తగ్గారని వైసీపీ నేతలు వితండవాదం చేశారు. అయితే పవన్‌ కళ్యాణ్‌ గత 3-4 నెలలుగా వరుసపెట్టి సినిమాలు పూర్తిచేస్తున్న సంగతి వారికి తెలియదనుకోలేము.

ఇప్పుడు వైసీపీ నేతల ముచ్చట తీర్చేందుకు పవన్‌ కళ్యాణ్‌ వారాహి వాహనంలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నేడు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత రూట్ మ్యాప్ ప్రకటించారు.

ఈ నెల 14నుంచి పవన్‌ కళ్యాణ్‌ ముందుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, అర్బన్, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలులో వారాహిలో పర్యటిస్తారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో వారాహిలో పర్యటిస్తారని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో ప్రజలతో మమేకం అయ్యేవిదంగా పవన్‌ కళ్యాణ్‌ పర్యటన సాగుతుందని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో కనిపిస్తేనే మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్లకు ఆవేశం వచ్చేస్తుంటుంది. ఇక ఆయన వారాహి వేసుకొని రాష్ట్రంలో పర్యటిస్తే మౌనంగా ఉండటం చాలా కష్టం. కనుక ముందుగా అంబటి రాంబాబు ట్విట్టర్‌లో ఆయనకు స్వాగత బాణాలు వేస్తారేమో.

మిగిలినవారు కూడా బాణాలు సిద్దం చేసుకొని సిద్దంగా ఉంటే, పవన్‌ కళ్యాణ్‌ రాగానే పని మొదలుపెట్టేయవచ్చు. అయినా ఈ మంత్రులు అంతంత జీతభత్యాలు తీసుకొంటూ ఏమి పనిచేస్తున్నారో కాస్త ఎవరైనా అడగండర్రా అంటే ఎవరూ అడగరు… వాళ్ళు చెప్పరు!