రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన… బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నాటి నుండి ఈరోజు వరకు మోడీ గానీ అమిత్ షా గానీ పవన్ కళ్యాణ్ కు అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. తాజాగా తెలంగాణాలో కూడా కలిసి పని చెయ్యబోతున్నాయి అని సమాచారం.
ఇది ఇలా ఉండగా… మార్చి 15నకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణకు రాబోతున్నారు. సీఏఏకు అనుకూలంగా జరిగే సభలో షా పాల్గొననున్నారు. ఈ సభని రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే ఎల్బీ స్టేడియాన్ని బుక్ చేశారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ హాజరు అయ్యే అవకాశం ఉందని సమాచారం.
బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాకా పవన్ కళ్యాణ్, అమిత్ షా వేదికను పంచుకోవడం ఇదే మొదటి సారి. దీనితో ఈ సభ కోసం జనసైనికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా తెలంగాణాలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యమైన ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంది.
అయితే ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికలలో మాత్రం ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వివిధ రాజకీయ వేదికల నుండి సీఏఏకు అనుకూలంగా అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లిం ఓటర్లు దూరం అవుతున్నారు అనే భయం లేకుండా సీఏఏకు భేషరతుగా మద్దతు ఇస్తున్నారు.