మార్చి 14వ తేదీ 2014వ సంవత్సరంలో పురుడు పోసుకున్న జనసేన పార్టీ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కొత్త ఊపిరి అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న కార్యకర్తలు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ వేదికగా సమావేశమయ్యారు. అంతేకాదు… పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి పోటీ చేయాలని సరికొత్త ‘పల్లవి’ అందుకున్నారు.
విజయవాడలో ఏర్పాటు చేసుకున్న ‘జనసేన’ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు విజయవాడ నుంచి పోటీ చేయాలని తీర్మానించుకున్నారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లాల వారీగా జనసేన కార్యవర్గాలు ఏర్పాటు కాగా, ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగకపోవడంతో, కార్యకర్తలు సైతం తమ దారిలో తాము వెళ్లిపోయారు. తిరిగి అడపాదడపా క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించినా రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు వారిలో నూతన ఉత్సాహానికి కారణమయ్యాయి.