తెలంగాణాలోని జగిత్యాల జిల్లా, కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో ఏకంగా 61 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. బస్సు ప్రమాదం జరిగిన రోజున దీనిపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తప్పంతా డ్రైవర్ దేనని, అతను అప్రమత్తంగా డ్రైవ్ చేస్తే ఈ ఘోరమైన సంఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇందులో ఏ మాత్రం తప్పులేదు.
అప్పుడు శవ రాజకీయాలు చేయడం ఏ రాజకీయ నాయకుడికైనా భావ్యం కాదు. సరైన రీతిలో స్పందించినందుకు పవన్ ను నిజంగా అభినందించాల్సిందే! కట్ చేసి ఒక నాలుగు నెలలు ముందుకెళితే, సరిగ్గా ఇలాంటి అనూహ్యమైన సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో కూడా చోటు చేసుకుంది. మరి దానిపై ఈ జనసేన అధినేత గారు ఎలా స్పందించారు? అంటే అప్పుడు ‘శవ రాజకీయాలు’ చేసారని చెప్పకతప్పదు.
అవును… నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అయితే వైఎస్సార్ పార్థీవదేహాన్ని పక్కన పెట్టుకుని శవరాజకీయాలు చేసారో, ఇటీవల ఏపీలో జరిగిన బస్సు యాక్సిడెంట్ లో కూడా నెపాన్ని ఏపీ ప్రభుత్వంపై నెడుతూ శవరాజకీయాలు చేసారు. అయితే నేటి రాజకీయాలలో విలువలు లేని ఇలాంటి విమర్శలు సహజం గనుక, నాటి పవన్ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు.
కానీ నేడు అదే పవన్, తెలంగాణా విషయానికి వచ్చేసరికి మరోలా స్పందించడంతో… జనసేన అధినేత కార్నర్ అయ్యారు. బహుశా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు భయపడి, సర్కార్ పై విమర్శలు చేయడానికి పవన్ సాహసించలేదేమో? అన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇదేనా పవన్ చెప్పే నీతి సిద్ధాంతాలు? రాజకీయ విలువలు? అన్న ప్రశ్నలకైతే కొదవేలేదు.