చాలా కాలం నుండి పార్టీకి కొరకరాని కొయ్యి గా పరిణమించిన రాజోలు ఎమ్మెల్యే, రాపాక వరప్రసాదరావుని జనసేన పార్టీ సాగనంపింది. శాసనసభలో సోమవారం అమరావతి రాజధానికి మద్దతుగా ప్రభుత్వం ప్రతిపాదించే మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకత తెలపాలని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ రాపాకకు లేఖ రాసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు.
అధికారపక్ష వైసీపీ ఎమ్మెల్యేల కంటే ఒక అడుగు ముందుకేసి జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతు తెలిపారు. తన ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనాదక్షతను పొగడ్తలతో ముంచెత్తారు. రాపాక స్పీచ్కు సీఎం జగన్ సైతం చప్పట్లు కొట్టి అభినందించారు. దీనితో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటి ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడానికి నిర్ణయం తీసుకుంది.
చాలా కాలం నుండి రాపాక జనసేనకు భారంగా పరిణమించారు. ఆది నుంచి వ్యూహాత్మకంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఉపేక్షిస్తే పార్టీకి నష్టమని ఆయనను సస్పెండ్ చేశారు. దీనితో జనసేనకు ప్రస్తుత అసెంబ్లీలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. అయితే ఇది రాజకీయంగా సరైన నిర్ణయమనే చెప్పుకోవాలి.
పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడంతో రాపాక కూడా తనని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గుర్తించమని స్పీకర్ ని కోరే అవకాశం ఉంది. గతంలో టీడీపీ నుండి ఎన్నికైన వల్లభనేని వంశీ మాదిరి గానే రాపాక కు కూడా వేరుగా సీటు ఇచ్చే అవకాశం ఉంది. దానితో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవచ్చు.