జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం వివాదంపై స్పందించారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు పూర్తి మద్దతిస్తూ శ్రీవారి ఆభరణాలు మాయం చేశారు అన్నట్టు వ్యంగ్యంగా ట్వీట్లు వేశారు. అదే సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఐపిఎస్ ఆఫీసర్ తనను కలిసి శ్రీవారి ఆభరణాలు ఒక ప్రత్యేక విమానంలో ఇతర దేశానికి తరలించినట్టు కూడా చెప్పుకొచ్చారు.
అయితే టీటీడీ బోర్డు చెప్పినట్టుగా పింక్ డైమండ్ కాదు పింక్ రూబీ అన్న విషయాన్నీ ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. రాష్ట్రప్రభుత్వాన్ని విమర్శించడమే పని కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నారేమో. అయితే పగిలింది పింక్ రూబీనే అనే నివేదికపై పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు అప్పటి టీటీడీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు స్వయంగా సంతకం చేసారు.
అలా నివేదిక ఎందుకు ఇచ్చారు అని కనీసం ఐవైఆర్ కృష్ణారావుని అయినా అడిగి ఉండాల్సింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో శ్రీవారి ఆభరణాలు కాంగ్రెస్ గవర్నమెంట్ టైములో తరలిపోయాయి అని చెప్పుకొచ్చారు. తరువాత అదే పార్టీలో చిరంజీవి చేరారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి అన్నీ తెలిసినా మాట్లాడని టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చి ఉండకూడదు.
అసలు ఇన్ని సంవత్సరాలుగా స్వామి వారి సేవలో ఉండి ప్రభుత్వం రిటైర్ చేశాక మాత్రమే ఎందుకు రమణ దీక్షితుల వారు ఇప్పుడే ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసుండాల్సింది. అవేమి చేయకపోవడంతో ఇదంతా కేవలం చంద్రబాబుని ఇరుకున పెట్టే ప్రయత్నం మాత్రమే అనుకోవాలి