జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత బయటకు వచ్చి రాజధాని వివాదం పై తన అభిప్రాయం చెప్పారు. పాలన ఒకే చోట ఉంచి అన్ని ప్రాంతాలను అబివృద్ది చేయాలని ఆయన అన్నారు. రైతులు వ్యక్తిని నమ్మి భూములు ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారని ఆయన అన్నారు .ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరికాదని ఆయన అన్నారు.
ఇక్కడ వరకు బానే ఉంది. రాజధాని మూడు ముక్కలుగా తగదని, రాజధాని అమరావతిలో పెట్టినా, విశాఖలో పెట్టినా, కర్నూల్ లో పెట్టినా తమకు సమ్మతమేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వైఖరి తప్పని నిపుణులు అంటున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తూ, మూడు రాజధానులు పెట్టడం లేదా, రాజధాని తరలించడం జరగని పని అంటున్నారు.
రైతులకు న్యాయం చెయ్యడం అంటే వారి భూములకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అది జరగని పని. వాళ్ళు ఇచ్చిన భూములు ఇచ్చినట్టుగా ఇవ్వడం కూడా జరగదు. ఈ తరుణంలో రాజధాని రైతులకు న్యాయం అంటే రాజధానిని అమరావతిలో కొనసాగించడం మాత్రమే. వేరే చోటకి తరలించి ఇక్కడి రైతులకు న్యాయం జరగాలి అంటే మాత్రం అది కాని పని.
మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్నారు. నిరసనలు తెలుపుతున్న రైతులతో మాట్లాడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయానికి రానుండడంతో గ్రామాలలో పోలీసు పహారా గట్టిగా ఉంది. సచివాలయానికి వెళ్లే దారిలో నిరసనలకు, ధర్నాలకు పోలీసు అనుమతి ఇవ్వడం లేదు.