తన సినీ వేడుకలు తప్ప, ఇతర వేదికలపై పెద్దగా దర్శనమివ్వని పవన్ కళ్యాణ్ ఆలోచనల్లో పెను మార్పు వచ్చినట్లుగా కనపడుతోంది. ఇటీవల ఏకంగా లండన్ వెళ్లి మరీ ఓ కార్యక్రమంలో భాగస్వామి కాగా, రెండు రోజుల క్రితం ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’లో పాల్గొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీని నుండి కోలుకోక ముందే పవన్ కళ్యాణ్ హాజరుపై తాజాగా మరొక వార్త ప్రచారంలో ఉంది.
ఇప్పటివరకు జరిగిన ప్రో కబడ్డీ లీగ్స్ లో పెద్దగా ప్రతిభ చూపని తెలుగు టైటాన్స్ జట్టు రెండవ సారి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. రెండో సీజన్ లో సెమీస్ వరకు చేరినప్పటికీ ఫైనల్ కు చేరలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో మరోసారి తెలుగు టైటాన్స్ సెమీస్ చేరడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ చౌదరి, సందీప్ నర్వాల్ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అలాగే రాహుల్ చౌదరి అద్భుతమైన ఫాంలో ఉండడం, టోర్నీలో సెంచరీ పాయింట్లు సాధించిన ఆటగాడిగా నిలవడం జట్టులో మరింత ఉత్సాహం నింపుతోంది.
ఈ ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారని టాక్. నేటి సాయంత్రం జైపూర్ పింక్ పాంథర్స్ తో తలపడనున్న తెలుగు టైటాన్స్ జట్టు ను ఫేవరేట్ గా పరిగణిస్తున్నప్పటికీ, ఒత్తిడి లేకుండా అండర్ డాగ్ గా పింక్ పాంథర్స్ జట్టు బరిలోకి దిగుతోంది. మొదట్లో తలపడి, మద్యలో తడబడి, చివర్లో పుంజుకున్న జైపూర్ జట్టుతో తెలుగు టైటాన్స్ జట్టుకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో జట్టులో స్థైర్యం నింపేందుకు నిర్వాహకులు పవన్ కల్యాణ్ ను మ్యాచ్ కు ఆహ్వానించగా, పవన్ కూడా మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రానున్నారని తెలుస్తోంది.