కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కు గానూ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురకు వారలు కురిపించిన నిర్మలమ్మ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండి చెయ్యి చూపించారు.
ఏదన్నా ఇస్తే వచ్చే నాగార్జునసాగర్, తిరుపతి ఉపఎన్నికలలో చెప్పుకోవచ్చనుకున్న బీజేపీ నాయకుల ఆశలు కూడా అడియాసలు అయ్యాయి. ఇక జనసేన పరిస్థితి అయితే మరీ దారుణం. జనసేన ఏపీలో పొత్తులో పెద్ద పార్టీ అయినా పెద్దగా బీజేపీని ప్రభావితం చెయ్యగలిగే పరిస్థితి లేదు. కానీ బీజేపీ చేసే తప్పులకు పవన్ కళ్యాణ్ సంజాయిషీ చెప్పుకోవాలి.
2019 లో కేంద్రం విభజన హామీలలో భాగంగా అప్పట్లో ఒక కమిటి వేసి 70,000 కోట్లు రావాల్సి ఉందని పవన్ ప్రకటించారు. ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టి బీజేపీతో ఎన్నికల తరువాత పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఏమీ ఇవ్వకుండానే తిరుపతి ఉపఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ కు ఏం చేసింది అనే ప్రశ్న ఎప్పుడు వచ్చినా ఆ పాపంలో పవన్ కు కూడా అకారణంగా వాటా వెళ్తుంది అని జనసైనికులు అసహనంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కలిసొచ్చే అంశం ఏమిటంటే అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు టీడీపీ కూడా బీజేపీతో ఘర్షణ వాతావరణం కోరుకోవడం లేదు. దినితో ఇప్పటికిప్పుడు వారు పవన్ ని ఇరుకునపెట్టే అవకాశాలు తక్కువే.