జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీనే టార్గెట్ గా విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అయితే ఒక్కోసారి ఆయన చేస్తున్న ప్రకటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఆయన చంద్రబాబు నాయుడుకు గానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గానీ తెలంగాణాలో పర్యటించే ధైర్యం లేదని చెప్పుకొచ్చారు.
జనసైనికుల బలం కలిగిన తనకు మాత్రమే ఆ సత్తా ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను సోషల్ మీడియాలో ఆయా పార్టీల అభిమానులు విమర్శిస్తున్నారు. కనీసం తెలంగాణాలో పోటీ కూడా చెయ్యలేని పవన్ కళ్యాణ్ తెలుగు దేశమును విమర్శించడమా అని జోకులు వేస్తున్నారు. మరో పక్క వైకాపా అభిమానులు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కేంద్రంగానే తమ పార్టీ కార్యకలాపాలు జరుగుతున్న విషయాన్నీ గుర్తు చేసారు.
“పవన్ కళ్యాణ్ చంద్రబాబు వంటి వారు అమరావతి నుండి కార్యకలాపాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. మేము మాత్రం ధైర్యంగా హైదరాబాద్ నుండే పార్టీని నడిపిస్తున్నాం,” అని వారు చెప్పుకొస్తున్నారు. 2019లో గనుక తెలంగాణ ఎన్నికలు వస్తే పోటీ చేద్దామని భావించిన పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని భయపడి తెలంగాణ ఎన్నికల నుండి విరమించుకున్నారు. అయితే తెలంగాణ పేరుతో మిగతా పార్టీలను విమర్శించడం హాస్యాస్పదం అని ఆ పార్టీ వారు అంటున్నారు.